శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. వచ్చే నెల 27, 2026న నిర్వహించనున్న ఈ వేడుకల నేపథ్యంలో, వివిధ కారణాల వల్ల భద్రాచలానికి వెళ్లలేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాముల వారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తలంబ్రాల ప్యాకెట్లను పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకుని బుక్ చేసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను హోం డెలివరీ ద్వారా భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
పారంపరిక విధానాల్లో గోటితో ఒలిచిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఉపయోగిస్తారని, ఈ విశిష్టమైన సేవను భక్తుల ఇళ్లకు చేరవేయాలనే సంకల్పంతో మూడు సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎండీ వివరించారు. ఈ సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, 2022లో సుమారు 89 వేల మంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోగా, గత మూడేళ్లలో లక్షలాది మంది ఈ సేవను పొందారని తెలిపారు.
వచ్చే నెల 27న భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు హాజరుకాలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ సదుపాయం ఉందని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని చెప్పారు. మరిన్ని వివరాల కోసం భక్తులు 040-23450033, 040-69440069 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!