
.jpg&w=3840&q=75)
ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి విద్యుత్ ఉత్పత్తి, వినియోగమే అసలైన కొలమానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన క్లైమేట్ వీక్ సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చేయడం లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 2034 నాటికి నెట్జీరో నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ, కాలుష్య నియంత్రణ, సుస్థిర పట్టణాభివృద్ధి విధానాలకు రాష్ట్రం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి సమతుల్య అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం వివరించారు. ఓఆర్ఆర్ మరియు ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. 2034 నాటికి విద్యుత్ డిమాండ్ 34 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తూ పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపులు, 3,500 విద్యుత్ బస్సులు, మెట్రో విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ, సరస్సుల సంరక్షణ వంటి చర్యలతో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!