

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మరియు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు కురిపించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఆర్జీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తో కలిసి సందర్శించిన గేట్స్ డేటా లేక్ వ్యవస్థ, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టుపై సమగ్రంగా అవగాహన పొందారు. రైతులు మరియు ప్రజలకు 42 రకాల సమాచారాన్ని రియల్ టైమ్లో అందిస్తూ 921 పౌరసేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జీఎస్టీ అమలుతో పన్నుల వసూళ్లు సులభతరమయ్యాయని, బ్లాక్ చైన్ సాంకేతికతతో క్యూఆర్ కోడ్ భద్రతా ఫీచర్లతో భూ రికార్డులను రక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పత్రాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఏఐ సెర్చ్ బార్ ప్రారంభించామని అధికారులు వివరించగా గేట్స్ ప్రశంసించారు.
కుప్పం, చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టును గేట్స్ ప్రత్యేకంగా అభినందించారు. రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షల అనంతరం ఏఐ ఆధారిత వైద్య సేవల ద్వారా జీవనశైలి మార్పులు, ఆహార సూచనలు అందిస్తున్న విధానం చాలా బాగుందని తెలిపారు. గర్భిణీలకు తక్కువ వ్యయంతో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలో 30 శాతం భూభాగాన్ని నీటి వనరులు మరియు పచ్చదనానికి కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్జీజీఎస్ ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరిగి ప్రజల జీవితాల్లో మార్పు వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!