

హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిషేధిత చైనీస్ మాంజా పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రమాదాలకు దారి తీసే ఈ మాంజా వినియోగాన్ని అడ్డుకునేందుకు స్పెషల్ డ్రైవ్ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జరిగిన తనిఖీల్లో, సుమారు రూ.43 లక్షల విలువైన 2,150 మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి, 57 మందిని అరెస్ట్ చేశారు.
ఇక గత నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం 132 కేసులు నమోదయ్యాయి. వాటిలో భాగంగా రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను సీజ్ చేయగా, దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు.
చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హానిని కలిగించడమే కాకుండా, పక్షులు మరియు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అందుకే ప్రతి ఒక్కరూ సురక్షితమైన దారాలనే ఉపయోగిస్తూ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!