

వైకాపా హయాంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి తయారీలో భోలేబాబా డెయిరీ పెద్ద ఎత్తున మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ రసాయనాలను దిల్లీకి చెందిన ఓ సంస్థ కొరియా నుంచి దిగుమతి చేసుకుని సుగంధ్ ఆయిల్స్ ద్వారా భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్లు గుర్తించారు. గతేడాది ఏప్రిల్ 23 న సుగంధ్ ఆయిల్స్లో జరిగిన సోదాల్లో 200 కిలోల డ్రమ్ముల్లో ‘వీనస్’ బ్రాండ్ మోనోగ్లిజరైడ్స్ పెద్ద ఎత్తున లభించాయి. అనంతరం ఉత్తరాఖండ్ భగవాన్పుర్లోని భోలేబాబా డెయిరీలో కూడా అదే రసాయనాలు బయటపడటంతో, వాటితో కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమలకు పంపినట్లు సిట్ అభియోగపత్రంలో పేర్కొంది.
NDDB-CALF ప్రయోగశాలలో 2024 జులైలో నిర్వహించిన పరీక్షల్లో, తిరుమల తిరుపతి దేవస్థానాలు పంపించిన నెయ్యి నమూనాల్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉండే అవకాశముందని నివేదికలు వెల్లడించాయి. మోనోగ్లిజరైడ్స్ వెజిటబుల్ ఆయిల్స్ లేదా జంతు కొవ్వులతో తయారవుతాయని, చౌకగా లభించే జంతు కొవ్వులనే కల్తీ నెయ్యిలో ఎక్కువగా వాడుతారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, మోనోగ్లిజరైడ్స్ మూలం ఏంటన్న దానిపై సిట్ లోతైన దర్యాప్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పామ్ ఆయిల్, పామ్కెర్నెల్ ఆయిల్కు ఇతర ఫుడ్ గ్రేడ్ రసాయనాలు కలిపి నెయ్యిలా మభ్యపెట్టినట్లు కూడా సిట్ స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!