

మేడారంలో జరుగుతున్న పుననిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో వన దేవతలైన పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, పూర్తి రహస్యంగా పూజా కార్యక్రమాలను పూజారులు నిర్వహిస్తున్నారు.
ఈ పూజా కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. గద్దెల పునఃప్రతిష్టాపన నేపథ్యంలో భక్తులకు వన దేవతల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు భక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సహకరించాలని పూజారులు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ మహోత్సవాన్ని ఈసారి మరింత వైభవంగా, సరికొత్త రూపంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మేడారం శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.251 కోట్లతో విస్తృత ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఈ పనులు శరవేగంగా సాగుతుండగా, నిన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!