

నేడు భారతదేశం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటోంది. 1948 జనవరి 30 న ఢిల్లీలోని బిర్లా భవన్ (ప్రస్తుతం గాంధీ స్మృతి)లో జరిగిన ప్రార్థనా సమావేశంలో నాథూరాం గాడ్సే కాల్పులు జరపడంతో మహాత్మా గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఈ దినాన్ని దేశవ్యాప్తంగా అమరవీరుల స్మరణా దినం (Martyrs’ Day)గా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికలో పేర్కొన్నారు – “జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. పూజ్య బాపు ఎల్లప్పుడూ స్వదేశీని ప్రోత్సహించారు. ఇది అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూలస్తంభంగా నిలుస్తుంది. ఆయన వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తిగా మారతాయి.” గాంధీ వర్థంతి వేళ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరినీ స్మరించుకుంటారు. ఈ ఏడాది మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజ్ ఘాట్ వద్ద అధికారిక నివాళులు, ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండి ఉంది. “హే రామ్” అంటూ ప్రాణాలు విడిచిన ఆయన ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వ మార్గాన్ని చూపుతున్నాయి. ఈ మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!