

పాకిస్థాన్ లో యాంటీ-టెర్రరిజం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘డిజిటల్ టెర్రరిజం’ ఆరోపణల పై ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. నిందితులంతా ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తుండటంతో, వారి గైర్హాజరీలోనే ఇస్లామాబాద్ లోని ఏటీసీ న్యాయస్థానం ఈ తీర్పును ప్రకటించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తాహిర్ అబ్బాస్ సిప్రా శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేశారు.
శిక్ష పడిన వారిలో సీనియర్ జర్నలిస్టులు వజహత్ సయీద్ ఖాన్, సాబిర్ షకీర్, షాహీన్ సెహబాయ్, మోయీద్ పీర్జాదా ఉన్నారు. వీరితో పాటు యూట్యూబర్లు ఆదిల్ రాజా, హైదర్ రజా మెహదీ, అలాగే మాజీ సైనికాధికారి సయ్యద్ అక్బర్ హుస్సేన్ కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. కోర్టు ప్రతి ఒక్కరికీ రెండు యావజ్జీవ కారాగార శిక్షలతో పాటు అదనంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. దీనితో పాటు భారీ జరిమానాలు కూడా విధించినట్లు వెల్లడించింది.
2023 మే 9 న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో నిందితులు తమ ఆన్లైన్ ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రభుత్వ, సైనిక సంస్థల పై దాడులకు ప్రజలను ప్రేరేపించారని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఈ చర్యల వల్ల సమాజంలో భయాందోళనలు వ్యాప్తి చెందాయని ఆరోపించింది.
ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన కోర్టు, నిందితుల చర్యలు ‘డిజిటల్ టెర్రరిజం’ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం, జాతీయ భద్రతకు ముప్పుగా మారే విధంగా ఆన్లైన్ ప్రచారం నిర్వహించడం తీవ్రమైన నేరాలుగా కోర్టు అభిప్రాయపడింది.
పాకిస్థాన్ పై యుద్ధానికి ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాల కింద రామ్నా పోలీస్ స్టేషన్, అబ్పారా పోలీస్ స్టేషన్ లలో ఈ కేసులు నమోదు అయ్యాయి. అయితే, యాంటీ-టెర్రరిజం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!