

ఇటీవల సోషల్ మీడియా కొందరి చేతుల్లో అభిప్రాయ వ్యక్తీకరణ వేదికగా కాకుండా, బ్లాక్ మెయిలింగ్కు ఉపయోగించే అస్త్రంగా మారుతోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. యూట్యూబ్లో అకౌంట్ తెరిచి, వ్యక్తిగత అసంతృప్తి లేదా డబ్బుల కోసం ఆలయాలపై, పవిత్ర ప్రసాదాలపై ఆధారంలేని ఆరోపణలు చేస్తూ వీడియోలు విడుదల చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్న దేవాలయాలు, ప్రసాదాలను వివాదాల్లోకి లాగడం ద్వారా కొందరు యూట్యూబర్లు పరిమితులు దాటుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త ఉందంటూ ఒక యూట్యూబర్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. అలాగే అంతకు ముందు భద్రాచలంలో రామయ్య లడ్డూలో పురుగు ఉందంటూ మరో వీడియో వైరల్ కావడం కలకలం సృష్టించింది.
సింహాచలం ఘటనపై విచారణ చేపట్టిన ఆలయ అధికారులు అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న కోపంతో, ఆ యూట్యూబర్ బయట నుంచి నత్త తెచ్చి ప్రసాదంలో పెట్టి తప్పుడు వీడియో చిత్రీకరించినట్టు విచారణలో తేలింది. అధికారులు గట్టిగా ప్రశ్నించడంతో అతడు తప్పును అంగీకరించి వీడియోను తొలగించినట్టు తెలిపారు. ఈ ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
భద్రాచలం ఘటనలోనూ లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అధికారులు తేల్చారు. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ వీడియోలు రూపొందించారన్న నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవిత్రమైన ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం క్షమించరాని నేరమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కేవలం వీడియోలు డిలీట్ చేశారని వదిలేస్తే, భవిష్యత్తులో మరిన్ని ఆలయాలు, మరిన్ని పవిత్ర అంశాలు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!