

సంక్రాంతి వేడుకల్లో భాగంగా పిఠాపురం లో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదారి యాసలో మాట్లాడి సభికులను ఉత్సాహపరిచారు. గోదావరి జిల్లాలంటే కోడిపందేలు, జూదాలే అన్న భావన సరైంది కాదని, సంక్రాంతి లాంటి గొప్ప పండుగను అటువంటి అంశాలకు పరిమితం చేస్తే సమాజానికి తప్పుడు సంకేతం వెళుతుందని హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధం ప్రధానంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
మూడు రోజుల ఉత్సవాలను ప్రారంభించేందుకు పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్కు కూచిపూడి నృత్యకారులు ఘనస్వాగతం పలికారు. గరగ నృత్యాలు, కోలాటాలు, థింసా వంటి గిరిజన నృత్యాలు, పులివేషాల ప్రదర్శనలను ఆయన ఆస్వాదించారు. అనంతరం హరిదాసులకు స్వయంపాకం దానం చేసి, చిన్నారులకు భోగిపండ్లు వేసి ఆశీర్వదించారు. ఆపై పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, అధికారులను నిలదీశారు. శివరాత్రి నాటికి సమస్యలు పరిష్కరించాలని ఆదేశిస్తూ, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!