

న్యూఢిల్లీ: జనగణన–2027 నిర్వహణపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో కీలక సమీక్షా సమావేశం నేడు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించగా, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జనగణన నోడల్ అధికారులు, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జనగణన కార్యకలాపాల డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రిజిస్ట్రార్ జనరల్ & జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ, అదనపు రిజిస్ట్రార్ జనరల్స్ సునీల్ కుమార్, సంజీవ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్తో పాటు ORGIకి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జనగణన–2027 ను చారిత్రాత్మక జాతీయ కార్యక్రమంగా అభివర్ణించిన అధికారులు, డిజిటల్ సాధనాల వినియోగం, ముఖ్యంగా స్వీయ-ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర హోం కార్యదర్శి, భారతదేశంలో జనగణనకు ఉన్న దీర్ఘకాలిక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, జనగణన–2027 ను విజయవంతంగా నిర్వహించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జనగణన సిబ్బందిని సమయానికి నియమించి శిక్షణ ఇవ్వడం, నోటిఫికేషన్లను పునఃప్రచురించడం, 2027 మార్చి 31 వరకు పరిపాలనా లేదా సరిహద్దు మార్పులు చేయకుండా ఉండడం, డిజిటల్ సాధనాల సమర్థ వినియోగం, ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రచార వ్యూహాల అమలు వంటి అంశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే, జనగణన కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష కోసం ప్రధాన కార్యదర్శుల సహకారం అవసరమని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!