

కాళేశ్వరం ప్రాజెక్ట్లో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్ల జాబితాలో చేరింది. 2025 పోస్ట్–మాన్సూన్ తనిఖీల్లో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మేడిగడ్డ బ్యారేజ్ను కేటగిరీ–1 గా వర్గీకరించింది. అవసరమైన మరమ్మతులు, నివారణ చర్యలు చేపట్టకపోతే బ్యారేజ్ భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. లోక్సభలో డ్యామ్ భద్రతపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా కేటగిరీ–1 లో గుర్తించిన మూడు డ్యామ్లలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ ఒకటిగా ఉండగా, మిగిలినవి ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్లోని బోకారో బ్యారేజ్ అని కేంద్రమంత్రి తెలిపారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్–2021 ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు, తర్వాత తనిఖీలు తప్పనిసరి అని పేర్కొన్నారు. 2025 లో దేశవ్యాప్తంగా ప్రీ–మాన్సూన్ సమయంలో 6,524 డ్యామ్లు, పోస్ట్–మాన్సూన్లో 6,553 డ్యామ్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈ తనిఖీల ఆధారంగా డ్యామ్లను మరమ్మతుల అత్యవసరతను బట్టి వర్గీకరించినట్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్డీఎస్ఏ సూచించిన నివారణ చర్యలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో 50 ఏళ్లు దాటిన 1,681 డ్యామ్లు ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!