

సికింద్రాబాద్ పరిధిలోని భోలక్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
స్క్రాప్ గోడౌన్లో ప్లాస్టిక్, ఇనుము, ఇతర వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.
ఈ అగ్నిప్రమాదంలో గోడౌన్లో నిల్వ చేసిన స్క్రాప్ పూర్తిగా దగ్ధమైంది. లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అయితే మంటల వల్ల దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భోలక్పూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను తాత్కాలికంగా మళ్లించడంతో పాటు, భద్రతా చర్యలుగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం వివరాలతో అధికారిక నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!