

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రికార్డు స్థాయిలో రూ. 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ను మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఫిబ్రవరి 2, 2026 న న్యూఢిల్లీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ ముఖ్యాంశాలపై వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2009 – 14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సగటున రూ. 886 కోట్ల కేటాయింపులు ఉండేవని, ప్రస్తుతం ఏపీకి దాదాపు 11 రెట్లు ఎక్కువ నిధులు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 92,649 కోట్ల విలువైన వివిధ రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, ఏపీ రైల్వే నెట్వర్క్ 100 శాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై మార్గాలు ఏపీ గుండా వెళ్తాయని మంత్రి తెలిపారు. ఈ కారిడార్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, హైదరాబాద్ – బెంగళూరు మధ్య 2 గంటలు, హైదరాబాద్ – చెన్నై మధ్య 2 గంటల 55 నిమిషాలుగా ఉండనుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, అనుసంధానం, ఉపాధి అవకాశాలకు దోహదపడతాయని స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!