

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11, 12, 13 తేదీల్లో చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పర్యాటక శాఖ సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలుసుకుని, హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ గురించి వివరించారు. హైటెక్ సిటీ తుమ్మిడికుంటలో నిర్వహించే పతంగుల పండగకు ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. కూకట్పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్దిన్ చెరువు దగ్గర క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని ఆదేశించారు.
అదే సమయంలో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఫేజ్-2 నిర్మాణంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని ఎంపీ మల్లు రవి గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. రైతులకు మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!