

కేరళలోని తిరునావాయలో, నీలా నది (భారతపుళ) తీరంలో ప్రతిష్టాత్మక కేరళ కుంభమేళా మహోత్సవం ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని మహా మాఘ మహోత్సవం అని కూడా పిలుస్తారు. కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు.
సుమారు 270 ఏళ్ల విరామం తర్వాత ఈ కుంభమేళాను పూర్తిస్థాయిలో నిర్వహించడం విశేషం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఈ ఉత్సవం చివరిసారిగా 1755 లో నిర్వహించబడింది. ఫిబ్రవరి 3 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి కేరళతో పాటు తమిళనాడు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ప్రతిరోజూ సుమారు 50 వేల మందికి పైగా భక్తులు నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాశీ పండితుల ఆధ్వర్యంలో ప్రతి సాయంత్రం నీలా హారతి నిర్వహించనుండగా, ఈ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి కేరళ ఆర్టీసీ ప్రత్యేకంగా 100 బస్సులను ఏర్పాటు చేసింది. ఉత్సవం జరుగుతున్నన్ని రోజులు కేరళ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కలరిపయట్టు, యోగా, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కూడా నిర్వహిస్తోంది. వీటివల్ల భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మలయాళ సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆస్వాదించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!