
.jpg&w=3840&q=75)
నగరంలోని కీలక జలవనరాల్లో ఒకటైన దుర్గం చెరువు వద్ద జరుగుతున్న అక్రమ ఆక్రమణలకు అధికారులు చెక్ పెట్టారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో చెరువు పరిధిలో దాదాపు ఐదు ఎకరాల మేర సాగిన కబ్జాలను హైడ్రా అధికారులు మంగళవారం తొలగించారు.
చెరువు ప్రాంతాన్ని మట్టితో నింపి, వాహనాల పెయిడ్ పార్కింగ్ కోసం ఉపయోగిస్తూ ప్రతి నెలా సుమారు రూ.50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్న అక్రమ వ్యాపారానికి ఈ చర్యతో తెరపడింది. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ పరిధిలో జరిగిన ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.
అధికారులు అక్కడ ఉన్న వాహనాలను ఖాళీ చేయించి, ప్రస్తుతానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తదుపరి దశలో చెరువులో నింపిన మట్టిని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యవహారం పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐటీ కారిడార్లో ఒకప్పుడు దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు, ప్రస్తుతం 116 ఎకరాలకు పరిమితమైంది. ఉత్తర దిశను మినహాయిస్తే, మిగతా మూడు వైపులా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ కబ్జాలు ఏ విధంగా దశలవారీగా సాగాయో ఎన్ఆర్ఎస్సీ అందించిన శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!