రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ను ఐటీ రంగంతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్టెక్, డీప్టెక్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టు వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడం, అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను నిర్మించడం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 1200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ఆయన ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.
అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన హార్ట్ఫోర్డ్ హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో నగర నాయకత్వానికి లభించిన గుర్తింపుగా మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధునిక బీమా సేవల్లో హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. నగరంలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మారియట్, మెక్డొనాల్డ్స్, యూబీఎస్, డాజన్, వాన్గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్సీఏ హెల్త్కేర్, సిటిజన్స్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ సేవలందిస్తున్నాయని చెప్పారు. వీటిని కేవలం బ్యాక్ఎండ్ ఆపరేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా రూపాంతరం చెందేలా వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు.
పారదర్శక పాలన, సమర్థవంతమైన నాయకత్వం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు హార్ట్ఫోర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ టెక్నాలజీ సెంటర్ యూఎస్లోని హార్ట్ఫోర్డ్, చికాగో, షార్లెట్, కొలంబస్ కేంద్రాలకు అనుబంధంగా పని చేస్తూ, ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించే ‘ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ హబ్’గా వ్యవహరించనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హార్ట్ఫోర్డ్ ప్రెసిడెంట్ మోరిస్ టూకర్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ క్లైర్ బర్న్స్, సీఐవో శేఖర్ పన్నాల, ఇండియా ఎండీ సూర్య తమ్మిరాజు, సీటీవో ఇమ్రాన్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.




















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!