

రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక పై రిజర్వ్ బోగీలతో పాటు జనరల్ బోగీల్లో కూడా ప్రతి గంటకోసారి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శనివారం ఢిల్లీలోని రైల్భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మొదటి దశలో దేశవ్యాప్తంగా 80 రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 5 రైళ్లు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత మరో 80 రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు, తదుపరి మూడు సంవత్సరాల్లో అన్ని రైళ్ల జనరల్ బోగీల్లో కూడా ఈ శుభ్రత విధానాన్ని అమలు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తామని వివరించారు.
రైలు ప్రయాణం ప్రారంభమైన చోటు నుంచి గమ్యస్థానం వరకు రద్దీగా ఉండే సమయాల్లో ప్రతి గంటకోసారి, ఇతర సమయాల్లో గంటన్నరకోసారి శుభ్రపరిచే పనులు జరుగుతాయి. ఈ సేవల కోసం ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి రైలులో శుభ్రత నిర్వహణకు ప్రత్యేక ప్రొఫెషనల్ బృందాన్ని నియమించనున్నారు. అదనంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, రైళ్ల పరిశుభ్రతకు సంబంధించిన చిత్రాలను కృత్రిమ మేధస్సు ఆధారంగా పరిశీలించి సేవల నాణ్యతను అంచనా వేయనున్నారు.
దిండ్లు, దుప్పట్లు అందించడమే కాకుండా చిన్నపాటి మరమ్మతుల పనులను కూడా ఒకే కాంట్రాక్టర్కు అప్పగించనున్నట్లు తెలిపారు. శుభ్రత సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే సూపర్వైజర్లు కనీసం పన్నెండో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలని నిబంధనగా నిర్ణయించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!