

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం హైదరాబాద్పై కూడా పడింది. నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా మతపరమైన ప్రాంతాలు, పర్యాటక స్థలాలు, షాపింగ్ మాల్స్ వద్ద కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు జారీ చేశారు. హోటళ్లలో కూడా నిఘాను పెంచారు.
ఇటీవల దేశంలోని కొన్ని పేలుడు ఘటనలు హైదరాబాద్కు సంబంధాలు ఉన్నట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎన్ఐఏ మరియు పలు రాష్ట్రాల అధికారులు నగరంలో సోదాలు నిర్వహించగా, అనుమానిత వ్యక్తులు అరెస్టు కావడం భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేసింది. కొద్ది రోజుల క్రితం రాజేంద్రనగర్లో ఉగ్రవాద అనుమానాలతో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి సయ్యద్ ఇంట్లో జరిగిన సోదాలలో పలు వస్తువులు స్వాధీనం చేసినట్లు సమాచారం.
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర నిలిపిన కారులో జరిగిన శక్తివంతమైన పేలుడు దేశాన్ని కుదిపేసింది. పలువురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు, అందులో హైదరాబాద్ కూడా ఒకటి.











కామెంట్స్ (1)
భద్రత అంటే కేవలం పోలీసులు కాదు — మనందరి సహకారం అవసరం!