

శివరాత్రి పండుగ అంటే భక్తి, ఉపవాసం, జాగారం గుర్తుకు వస్తాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం, పానీయాలు తీసుకోకుండా శివారాధనలో నిమగ్నమవుతారు.
అయితే ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న మాట నిజమే అయినప్పటికీ, అది అందరికీ అనుకూలం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి ఉపవాసం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఉపవాస సమయంలో కేవలం నీటిని మాత్రమే తీసుకునే వారు గోరువెచ్చని నీటిని సేవించడం మంచిదని సూచిస్తున్నారు. ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరానికి మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. నిమ్మరసం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడటంతో పాటు అలసట రాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా దోహదపడుతుంది.
ఉపవాసం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించి, శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ సులభమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారే కఠిన ఉపవాసాలు చేయాలని సూచిస్తున్నారు.
మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడేవారు కూడా వైద్యుల సలహా లేకుండా ఉపవాసం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలు, పండ్లు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
భక్తి భావంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శివారాధన చేయడం అత్యంత ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!