

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిహారం చెక్కులను అందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబాలను ఆహ్వానించి స్వయంగా చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ధైర్యం చెప్పేందుకే సచివాలయానికి పిలిచి సహాయం అందించినట్లు సీఎం తెలిపారు.
ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మదీనాకు పంపినట్లు సీఎం గుర్తుచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు అత్యవసరంగా పాస్పోర్టులు, వీసాలు జారీ చేసి మదీనాకు పంపించామని తెలిపారు. అక్కడ భారత కాన్సులేట్, సౌదీ ప్రభుత్వంతో సమన్వయం చేసి మృతుల అంత్యక్రియలను జన్నతుల్ బఖీ సమాధి స్థలంలో నిర్వహించామని చెప్పారు.
నవంబర్ 17, 2025న మదీనా సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 44 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, గాయపడిన ఒకరి కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించి అందించారు. విదేశాల్లో జరిగే ప్రమాదాలకు సాధారణంగా ప్రభుత్వ పరిహారం ఉండదని, అయినప్పటికీ మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. ఇటీవల నాంపల్లి అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో తన అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం తన స్వంత ఖర్చులతో అయిదుగురిని హజ్ యాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. వారిని ఎంపిక చేసే బాధ్యతను స్థానిక ముస్లిం మత పెద్దలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!