

నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
అనంతరం నిర్మల్లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేకమైన అభిమానముందని తెలిపారు. జల్, జంగల్, జమీన్ అంటూ పోరాటాలు సాగిన ఈ ప్రాంతానికి కావాల్సిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. అందుకే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి బాట పట్టుతుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ దిశగా చర్యలు ప్రారంభించామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ రైతాంగానికి శాశ్వత నీటి భద్రత కల్పిస్తామని, బడ్జెట్ సమావేశాల లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. అలాగే బాసర ఐఐటీ పరిధిలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో పాటు, పదివేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయాలని సీఎం తెలిపారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ అజెండా అని పేర్కొంటూ, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ప్రధానిని ఎన్నిసార్లైనా కలుస్తానని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడతానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా అభివృద్ధి చేసే వారికే ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే చనాక–కొరటా ప్రాజెక్టుకు సీ. రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!