

దేశంలో పెట్రో ధరలను తక్షణమే పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. చమురు కంపెనీల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ల పరిస్థితిని ప్రభుత్వం దగ్గరగా గమనిస్తున్నప్పటికీ ప్రస్తుతం ధరలను పెంచే నిర్ణయం లేదని తెలిపాయి. కొంతకాలం వరకు ప్రస్తుత ఒత్తిడిని చమురు కంపెనీలే భరిస్తాయని వివరించాయి. అధికారుల ప్రకారం వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాలకు సరిపడా ముడి చమురు మరియు శుద్ధి చేసిన పెట్రో నిల్వలు దేశంలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు ఉన్న 21 రోజుల వ్యవధిని 25 రోజులకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. సిలిండర్ల నిల్వలను సమతుల్యంగా వినియోగించేందుకు, పంపిణీ సక్రమంగా జరగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దేశంలో ఒక కుటుంబం సగటున సంవత్సరానికి 7 నుంచి 8 ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఆరు వారాల కంటే ముందు కొత్త సిలిండర్ అవసరం చాలా మందికి ఉండదని కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని వెల్లడించాయి.
మరోవైపు రానున్న ఖరీఫ్ సీజన్కు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే గ్యాస్ సరఫరాలో కోతలు మరియు అంతర్జాతీయ పరిస్థితులు యూరియా ఉత్పత్తిపై కొంత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. దిగుమతి చేసే ఎరువుల వ్యయం కూడా సవాలుగా మారుతున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులు ఖరీఫ్ పంటలకు సరిపోతాయని ఎఫ్ఏఐ డైరెక్టర్ జనరల్ సురేశ్ కుమార్ చౌధరి తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం 177.31 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. ఇందులో 59.30 లక్షల టన్నుల యూరియా, 25.13 లక్షల టన్నుల డీఏపీ, 55.87 లక్షల టన్నుల ఎన్పీకేఎస్ ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!