

జెనీవాలోని భారత శాశ్వత మిషన్లో ఓ అధికారి నిధులను అక్రమంగా మళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 2 లక్షల స్విస్ ఫ్రాంకులు, అంటే దాదాపు రూ.2 కోట్ల మేరకు ప్రజాధనాన్ని సొంత ఖాతాలకు మళ్లించినట్లు తేలడంతో Central Bureau of Investigation (సీబీఐ) కేసు నమోదు చేసింది.
నిందితుడు మోహిత్ గతేడాది డిసెంబర్లో Permanent Mission of India, Genevaలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా చేరాడు. అక్కడ అకౌంట్ల నిర్వహణ బాధ్యతలు అతడికి అప్పగించగా, యూనియన్ బ్యాంక్ ఖాతాల ద్వారా జరిగే లావాదేవీలను పర్యవేక్షించేవాడు.
చెల్లింపుల కోసం ఉపయోగించే క్యూఆర్ కోడ్లలో నకిలీ కోడ్లు సృష్టించి, ఆ మొత్తాలను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏడాది వ్యవధిలో రూ.2 కోట్లకుపైగా దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై ప్రశ్నించగా మోహిత్ తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. దుర్వినియోగం చేసిన నిధులను క్రిప్టో గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు ఉపయోగించినట్లు వెల్లడించాడు. అనంతరం అతడిని కుటుంబంతో సహా భారత్కు పంపించారు. నేరపూరిత ద్రోహం, ఫోర్జరీ, ఖాతాల దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!