

2025–26 ఆర్థిక సంవత్సరం లోని తొలి ఆరు నెలల్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అదానీ గ్రూప్ భారీగా మూలధన వ్యయాలను పెంచింది. దీంతో గ్రూప్ ప్రధాన మౌలిక సదుపాయాల వ్యాపారాలు స్థిరంగా వృద్ధి సాధించాయి. ఈ ఆర్ధిక కాలంలో రికార్డు స్థాయి ఆదాయం నమోదు చేసినట్లు సంస్థ వివరించింది.
కేవలం ఆరు నెలల్లోనే గ్రూప్ రూ.67,870 కోట్ల (7.6 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టింది. దీంతో మొత్తం స్థూల ఆస్తుల విలువ రూ.6.77 లక్షల కోట్లకు (76 బిలియన్ డాలర్లు) చేరింది. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన రూ.1.5 లక్షల కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకునే అవకాశముందని గ్రూప్ వెల్లడించింది.
అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల రంగంలోని సంస్థలతో పోలిస్తే, అదానీ గ్రూప్ ఆస్తులపై ప్రతిఫలం (ROA) అత్యధికంగా 15.1% నమోదైంది. ఎబిటా పరంగా కూడా వృద్ధి కొనసాగింది. గ్రూప్ 12 నెలల ఎబిటా రూ.92,943 కోట్లకు (10.4 బిలియన్ డాలర్లు) చేరి, ఇది వార్షిక ప్రాతిపదికన 11.2% వృద్ధి. తొలి అర్ధ సంవత్సరంలో ఎబిటా రూ.47,375 కోట్లుగా నమోదైంది.
ఈ ఎబిటాలో 83% వాటా యుటిలిటీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, రవాణా అదానీ పోర్ట్స్ అండ్ SEZ, మరియు మౌలిక సదుపాయాల అదానీ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాల నుంచే వచ్చింది.
గ్రూప్ నికర అప్పు–ఎబిటా నిష్పత్తి మరింత మెరుగుపడింది. లక్ష్యంగా నిర్దేశించిన 3.5–4.5 పరిధితో పోలిస్తే, ప్రస్తుతం 3 రెట్ల వద్ద సౌకర్యవంతంగా కొనసాగుతోంది. అదానీ గ్రూప్ చేతిలో రూ.57,157 కోట్ల (6.4 బిలియన్ డాలర్లు) నగదు నిల్వలు ఉన్నాయి. ఇవి మొత్తం స్థూల రుణాల్లో 17% కు సమానం.
ఆస్తుల పెరుగుదల విషయంలో అదానీ ఎంటర్ప్రైజెస్ ముందంజలో నిలిచి రూ.17,595 కోట్ల మేర పెరుగుదల సాధించింది. తర్వాత స్థానాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.12,314 కోట్లు మరియు అదానీ పవర్ రూ.11,761 కోట్లు ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!