

మేడారం సమ్మక్క – సారక్క మహా జాతరలో భక్తుల రద్దీ గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈరోజు వరకు సుమారు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దె సమయానికి ఈ సంఖ్య కోటిని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.
మేడారం శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. మొత్తం సుమారు 70 ఎకరాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. మేడారం ప్రాంతానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కులు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చెక్డ్యామ్లు, పైప్లైన్ ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని మంత్రులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!