

సినీ పరిశ్రమకు చెందిన నటులు, టెక్నీషియన్లు పాల్గొనే టాలీవుడ్ ప్రొ లీగ్ (టీపీఎల్) క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్లో సినిమా, క్రికెట్ మేళవింపుతో ప్రత్యేక ఆకర్షణ కనిపించనుంది.
మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం టీపీఎల్ ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దిగ్గజ క్రికెటర్ Kapil Devతో పాటు మాజీ స్టార్ ఆటగాళ్లు Virender Sehwag, Suresh Raina పాల్గొన్నారు. సినీ నిర్మాత Dil Raju, నటుడు Sonu Sood, సంగీత దర్శకుడు Thaman S, నటి Raashii Khanna కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఈ సందర్భంగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, దిల్ రాజు, సోనూ సూద్ కలిసి స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కపిల్ దేవ్ మాట్లాడుతూ, క్రికెట్ పట్ల సినీ పరిశ్రమ చూపుతున్న ఆసక్తి అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ అందమైన నగరమే కాకుండా రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధమని ప్రశంసించారు.
వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, సినిమా రంగానికి చెందిన నటులు, సాంకేతిక నిపుణులు కలిసి క్రికెట్ ఆడటం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. దిల్ రాజు మాట్లాడుతూ, తెరపై కనిపించే నటులతో పాటు తెర వెనుక పనిచేసే వారూ ఈ లీగ్లో భాగమవుతారని తెలిపారు.
ఆరు జట్లతో నిర్వహించనున్న ఈ టోర్నీలో ప్రముఖ సినీ నిర్మాతలు జట్ల యజమానులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ఆశిష్ విద్యార్థి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఈబీజీ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్, టీపీఎల్ వ్యవస్థాపకుడు వంశీ తదితరులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!