

‘ధురంధర్ 2’ విజయోత్సాహంలో ఉన్న కథానాయకుడు రణ్వీర్ సింగ్ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ వివాదంపై ఆయన బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ‘కాంతార’లోని ‘పంజుర్లి’ హావభావాలను వేదికపై ప్రదర్శించడంపై ఆయనపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చర్య దైవిక భావాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు ఇటీవల విచారణకు రాగా, రణ్వీర్ సింగ్కు కోర్టు కొంత ఊరటనిస్తూ, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. అయితే తదుపరి విచారణకు పూర్తిస్థాయి సహకారం అందించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రణ్వీర్ సింగ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన లీగల్ టీమ్ వెల్లడించింది. అంతేకాకుండా, ఆయన మైసూర్లోని చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
ఇక రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా గతంలో ఇచ్చిన క్షమాపణ నిజాయతీగా లేదని న్యాయవాది ప్రశాంత్ ఆరోపించారు. అయితే ఇప్పుడు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పేందుకు సిద్ధమవడంతో ఈ వివాదం ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ‘ధురంధర్ 2’లో రణ్వీర్ నటనను ప్రశంసిస్తూ ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!