

దివంగత నటి శ్రీదేవి జీవితంపై రచయిత ధీరజ్ యు. కుమార్ రాస్తున్న ‘ది ఎంప్రెస్’ పుస్తకంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ అధ్యాయం రాశారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఈ పుస్తక వివరాలను నటి ప్రియాంక చోప్రా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. పుస్తకానికి ‘ది ఎంప్రెస్’ అనే పేరు తనకు తెలియదని, శ్రీదేవి స్థాయికి ‘స్క్రీన్ క్వీన్’ అనే పేరు మరింత సరిపోతుందని అన్నారు. తాను రాసిన అధ్యాయం అత్యుత్తమమని రచయితలు చెప్పారని, బహుశా ప్రతి రచయితకూ ఇదే మాట చెబుతున్నారేమో అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
శ్రీదేవితో తన అనుబంధాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ గుర్తుచేసుకున్నారు. ‘క్షణక్షణం’ సినిమా సమయంలో ఆమె నటనా ప్రతిభను మరింత దగ్గరగా అర్థం చేసుకున్నానని, ఒక్కో సన్నివేశానికి శ్రీదేవి 15 నుంచి 20 రకాల భావ వ్యక్తీకరణలు ఇచ్చేవారని ప్రశంసించారు. ‘మిస్టర్ ఇండియా’లో ఆమె చార్లీ చాప్లిన్ సన్నివేశం అద్భుతమని అన్నారు. చెన్నైలో శ్రీదేవిని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె గదిలోకి వచ్చిన ప్రతిసారీ స్వచ్ఛమైన గాలి వీచిన అనుభూతి కలిగేదని చెప్పారు. శ్రీదేవి మళ్లీ భూమిపైకి వస్తే బాగుంటుందని తన కోరికను వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!