

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇటీవల కాలంలో చాలా ట్రెండీగా మారిందని, ఆరోగ్యం కోసం చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు మరియు సురక్షిత వినియోగంపై సరైన అవగాహన అవసరమని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అన్ని కూరగాయలలో యాంటీ-న్యూట్రియంట్స్ ఉంటాయని, అవి శరీరంలో విటమిన్ శోషణను మరియు జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చని తెలిపారు. బూడిద గుమ్మడికాయలో ఆక్సిలేట్స్ అనే యాంటీ-న్యూట్రియంట్ అధికంగా ఉండటం వల్ల, పచ్చి జ్యూస్ రూపంలో తీసుకున్నప్పుడు ఇవి శరీరానికి ఎక్కువ మోతాదులో చేరుతాయి. ఇది కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని, అందరికీ కాకపోయినా కొంతమందిలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఆక్సిలేట్ ప్రభావాన్ని తగ్గించడానికి బూడిద గుమ్మడికాయను ఉడకబెట్టి లేదా కొద్దిగా వేగించి జ్యూస్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే యాంటీ-న్యూట్రియంట్ స్థాయి తగ్గి విటమిన్లు, ఖనిజాలు శరీరానికి మెరుగుగా అందుతాయని చెబుతున్నారు. అలాగే డిటాక్స్ జ్యూస్లపై ఉన్న ప్రచారాలు శాస్త్రీయంగా పూర్తిగా సరైనవి కావని, మన శరీరంలోని కిడ్నీలు, లివర్, లింఫాటిక్ సిస్టం సహజంగానే డిటాక్స్ ప్రక్రియను నిర్వహిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు తగిన నిద్ర ద్వారా శరీరం తన డిటాక్సిఫికేషన్ను స్వయంగా సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెబుతున్నారు. పండ్ల జ్యూస్ల కంటే పండ్లను నేరుగా తినడం మంచిదని, అలాగే బూడిద గుమ్మడికాయ జ్యూస్ లేదా ఇతర కూరగాయల జ్యూస్లను పచ్చిగా ఖాళీ కడుపుతో తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!