

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్ రెడ్డి పటాన్చెరు (నాగలపల్లి)–ఆదిలాబాద్ ప్రతిపాదిత కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. 136.503 కిలోమీటర్ల ఈ రైల్వే మార్గానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించిందని, ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించి రైల్వే పింక్ బుక్లో చేర్చాలని కేంద్రాన్ని కోరారు.
ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే నిర్మల్, ఆర్మూర్, ఆదిలాబాద్ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపారం, విద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డులకు వ్యాపారుల రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులకు హైదరాబాద్, నాందేడ్, కరీంనగర్ నగరాలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కళాఖండాలకు కొత్త మార్కెట్లు లభించడంతో పాటు ఆర్మూర్, అంకాపూర్ వంటి వ్యవసాయ ప్రాంతాలకు కూడా రైల్వే అనుసంధానం కల్పించి ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!