

రీజనల్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం అంత సులువు కాదు. ముందుగా ఇద్దరు హీరోలకు సరిపోయే పాత్రలు ఉండాలి. కథ విన్న తర్వాత హీరోలు తమ పాత్రలపై పూర్తిగా నమ్మకం కలిగితేనే ఒప్పుకుంటారు. అక్కడితో పని ముగియదు. పారితోషికాలు, బడ్జెట్ పరిమితులు, మార్కెటింగ్ అవకాశాలు అన్నీ లెక్కలోకి వస్తాయి. పాన్ ఇండియా సినిమాలకు భారీ బడ్జెట్, విస్తృత మార్కెట్ ఉండటంతో సౌకర్యం ఉంటుంది. కానీ రీజనల్ మల్టీస్టారర్కు అలాంటి స్వేచ్ఛ ఉండదు.
ఇప్పుడీ సవాళ్లే విక్టరీ వెంకటేష్తో దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న సినిమాకు ఎదురవుతున్నాయి. వెంకటేష్తో పాటు మరో హీరో అవసరం. మన హీరోలకంటే పక్క రాష్ట్రాల హీరో అయితే మార్కెట్కు బాగుంటుందనే ఆలోచన ఉంది. అయితే బడ్జెట్ ప్రధాన అడ్డంకి. మెగాస్టార్ సినిమాలో వెంకటేష్ను తీసుకోవడంతో బడ్జెట్ 15 కోట్లు పెరిగింది. అదే సమయంలో ఓటీటీ డీల్ తగ్గింది, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా గణనీయంగా పడిపోయాయి. అదృష్టవశాత్తూ సినిమా థియేటర్లలో బాగా ఆడటంతో నిర్మాతలు గట్టెక్కారు.
ఈ కొత్త ప్రాజెక్ట్లో రెండో హీరోగా ఒక స్టార్ను తీసుకుందామనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు పలు పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో తమిళ హీరో కార్తీ పేరు కూడా ఉంది. అయితే ఆయన పారితోషికం సుమారు 30 కోట్ల వరకు ఉండటంతో అది కూడా సవాల్గా మారింది. పైగా ఊపిరి సినిమా తర్వాత ఇతర హీరోల సినిమాల్లో చేయడంపై కార్తీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. బడ్జెట్కు సరిపడే, తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తమిళ, మలయాళ లేదా ఇతర భాషల హీరోను ఫైనల్ చేయడానికి టీమ్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల చివరికల్లా అనిల్ రావిపూడి వైజాగ్ వెళ్లి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!