

టాలీవుడ్లో నటుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి గత కొంతకాలంగా వెండితెరపై కనిపించలేదు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన ఆయన, ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’లో రానా నటిస్తున్నాడనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
మైథాలజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తుండగా, తేజ సజ్జ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘హనుమాన్’ విజయానంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ దాదాపు రెండేళ్లపాటు ఈ చిత్ర కథపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. 2027 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. రానా ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తే సినిమాకు మరింత బలం చేకూరుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!