

దేశీయ డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చిన యూపీఐకి పదేళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ లావాదేవీల పరిమాణం 2016-17లో 1.78 కోట్ల నుంచి 2025-26 నాటికి 24,162 కోట్లకు చేరింది. అంటే పదేళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.7,000 కోట్ల నుంచి సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరి దాదాపు 4,000 రెట్లు వృద్ధి చెందింది.
రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఎన్పీసీఐ రూపొందించిన యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువలో అసాధారణ వృద్ధిని సాధించింది. 2026లోనూ యూపీఐ కీలక మైలురాళ్లను చేరుకుంది. మేలో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,300 కోట్లను దాటి 2,320 కోట్లకు చేరగా, జూలైలో మరింత పెరిగి 2,366 కోట్లకు చేరాయి.
యూపీఐతో అనుసంధానమైన బ్యాంకుల సంఖ్య 2016-17లో 44గా ఉండగా, ప్రస్తుతం 703కి చేరింది. దేశీయ చెల్లింపుల వ్యవస్థగా ప్రారంభమైన యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా 11 దేశాల్లో దీనిని వినియోగిస్తున్నారు. 2025లో ప్రపంచ రియల్టైమ్ చెల్లింపుల లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా ఉందని ఐఎంఎఫ్ తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!