

భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక రక్షణ, పారిశ్రామిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) ప్లాంట్ను ఆయన సందర్శించారు. భారత వైమానిక దళం కోసం సుమారు 80 మధ్య శ్రేణి రవాణా విమానాల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాల కీలక భాగాలను హైదరాబాద్లో భారతీయ ఇంజినీర్లు, సిబ్బంది తయారు చేస్తున్న తీరును గోర్ పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, సురక్షితమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం భారత్-అమెరికా భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాక్హీడ్ మార్టిన్ సంయుక్త భాగస్వామ్యంతో 2010లో ఏర్పాటైన సంస్థ సీ-130జే విమానాలకు కీలక నిర్మాణ భాగాలను సరఫరా చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 12 సీ-130జే విమానాలు ఉన్నాయి. పాత రవాణా విమానాల స్థానంలో సుమారు 80 కొత్త మధ్య శ్రేణి రవాణా విమానాల కొనుగోలుకు లాక్హీడ్ మార్టిన్ సీ-130జేతో పాటు ఎంబ్రాయెర్ సి-390 మిలీనియం, ఎయిర్బస్ ఏ-400ఎమ్ పోటీలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్లో విమానాల మరమ్మతు, నిర్వహణ సేవల (ఎంఆర్ఓ) కేంద్రాన్ని డిసెంబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి తొలి విమానం సర్వీసింగ్ కోసం కేంద్రానికి రానుందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!