

వస్తు సేవల పన్ను చెల్లింపులో ఆలస్యం జరిగితే సాధారణంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం చేసిన తాజా మార్పుల ప్రకారం, ఇన్పుట్ పన్ను రాయితీ ద్వారా చెల్లించిన పన్నుపై వడ్డీ నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే నగదు రూపంలో చెల్లించిన పన్నుపై మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. అయితే ఈ మినహాయింపుకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి.
ఒక నెలలో జరిగిన అమ్మకాలు లేదా సరఫరాల వివరాలను అదే నెలకు సంబంధించిన రిటర్న్లో పూర్తిగా చూపించాలి. రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ సరైన కాలానికి చెందిన మొత్తం అమ్మకాలను అందులో చూపించి, పన్నును పూర్తిగా ఇన్పుట్ పన్ను రాయితీ ద్వారా చెల్లిస్తే వడ్డీ మినహాయింపు లభిస్తుంది. కానీ కొంత అమ్మకాల వివరాలను తదుపరి నెల రిటర్న్లో చూపిస్తే ఆ మొత్తానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యాపారి జనవరిలో లక్ష రూపాయల అమ్మకాలు చేసి, దానికి సంబంధించిన పన్ను రూ.12 వేలుగా భావిస్తే, అతని వద్ద రూ.14 వేల ఇన్పుట్ పన్ను రాయితీ ఉన్నప్పుడు నగదు చెల్లింపు అవసరం ఉండదు. ఆ రిటర్న్ను ఆరు నెలల ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ జనవరి అమ్మకాలన్నీ అదే రిటర్న్లో చూపిస్తే వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. కానీ అమ్మకాలలో కొంత భాగాన్ని తరువాతి నెల రిటర్న్లో చూపిస్తే ఆ మొత్తంపై వడ్డీ తప్పదు.
అలాగే అధికారులు ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించిన తర్వాత దాఖలు చేసే రిటర్న్లకు ఈ మినహాయింపు వర్తించదు. అటువంటి సందర్భాల్లో మొత్తం పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, రిటర్న్ గడువు తేదీ నాటికే నగదు రిజిస్టర్లో అందుబాటులో ఉన్న మొత్తాన్ని పన్ను చెల్లింపుకు ఉపయోగించినా ఆ మొత్తంపైనా వడ్డీ మినహాయింపు లభిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!