

ఫిడే చెస్ ఒలింపియాడ్ ఈ నెల 16 నుంచి ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే పోటీల్లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న భారత చెస్ బృందానికి వసతి విషయంలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. భారత గ్రాండ్మాస్టర్ శ్రీనాథ్ నారాయణన్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత బృందం సమర్కండ్ విమానాశ్రయానికి చేరుకుని ఐదు గంటలకు పైగా గడిచినా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి గదులు కేటాయించలేదు. ఎప్పుడు గదులు కేటాయిస్తారనే దానిపై కూడా స్పష్టత లేకపోయిందని ఆయన తెలిపారు.
ఈ సమస్యపై భారత యువ చెస్ స్టార్ విదిత్ గుజరాతీ కూడా స్పందించాడు. ఉజ్బెకిస్థాన్లో తమ వసతి ఏర్పాట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉందని పేర్కొన్నాడు. ఈ ఒలింపియాడ్లో భారత్ తరఫున ప్రపంచ ఛాంపియన్ గుకేశ్, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, విదిత్ గుజరాతీ, అర్జున్ ఇరిగేశీ తదితర ప్రముఖులు బరిలోకి దిగనున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 400 జట్లు పోటీపడుతుండగా.. ఓపెన్ విభాగంలో 208, మహిళల విభాగంలో 192 జట్లు పాల్గొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!