

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది 15వసారి. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబుకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం, ఆంధ్రప్రదేశ్ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుకు సాగేందుకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తితిదే పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని అభినందించారు. ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం 2027 సంవత్సరానికి సంబంధించిన తితిదే డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి పెద్దశేష వాహన సేవలోనూ చంద్రబాబు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!