

బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగిన వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా నేతలను చుట్టుముట్టి లాగడం, అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు స్పీకర్ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారని, స్పీకర్ బాధపడి ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని విచారం కూడా వ్యక్తం చేశారని తెలిపారు. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం ద్వారా వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, పేదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, ఉద్యోగాలు, సాగునీరు వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు నీటి షెడ్యూల్ ప్రకటించాలని, కాళేశ్వరం నీటిని రైతుల ప్రయోజనాలకు వినియోగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించిన కేటీఆర్.. మిగిలిన పాలనా కాలంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళా నేతలపై జరిగిన అవమానానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!