

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇరు పార్టీల నేతలు ఉపయోగిస్తున్న భాష ప్రజల్లో నవ్వులపాలు చేస్తోందని విమర్శించారు. స్పీకర్ను బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేరని అన్నారు. తాతా మధుతో పాటు పోలీసులపై చేయిచేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ వివాదాలపై అసెంబ్లీ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. 22ఏ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సర్టిఫికెట్లు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. సాగునీరు అందక దక్షిణ తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఐటీ సంస్థలు, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
సొంత ఇల్లు లేక, అద్దె భారం భరించలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని, పారిశుధ్య లోపాలు, దోమలు, వ్యాధులు కూడా ప్రజల సమస్యలను పెంచుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సిన శాసనసభను రాజకీయాలకు వేదికగా మార్చకూడదని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం తప్పేనని, విధుల్లో ఉన్న పోలీసులపై బీఆర్ఎస్ నేతలు దాడి చేయడం, దూషించడం కూడా తప్పేనని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలనే ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్హౌస్పై దాడి, కేసీఆర్పై హత్యాయత్నం వంటి ప్రచారాలను రాజకీయ నాటకంగా అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పోలీసుల ద్వారా భయపెట్టే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!