

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిరుపతి సహా మొత్తం 16 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రత్యేక గూఢచారి విభాగం ఎదుట లొంగిపోయారు.
తెలంగాణ పోలీసుల కీలక ఆపరేషన్ నేపథ్యంలో ఈ లొంగుబాట్లు జరిగినట్లు సమాచారం. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉన్న దేవ్ జీతో పాటు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. ఈ పరిణామాన్ని ఉద్యమ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా విశ్లేషిస్తున్నారు.
గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ఇది ముగింపు దశగా భావిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న చర్యల్లో వందలాది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మార్చి 31 నాటికి ఆపరేషన్ పూర్తి చేయాలని కేంద్రం గడువు నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిడ్మా సహా పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందగా, మల్లోజుల, ఆశన్న వంటి నేతలు ఇటీవల లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో విదేశాల్లో ఉన్న గణపతి గురించి కూడా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!