

అమెరికా–ఇరాన్ల మధ్య జరగాల్సిన యుద్ధ విరమణ చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అమెరికా చెబుతూనే, మరోవైపు పశ్చిమాసియాలో సైనిక బలగాల మోహరింపును పెంచడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ టెహ్రాన్ సహా పలు నగరాలపై వైమానిక దాడులు కొనసాగించగా, ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు చేసింది. యూఏఈ రాజధాని అబుధాబీపై జరిగిన దాడుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధి విషయంలో భారత్కు ఇరాన్ ఊరట కల్పించింది. భారత్తో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్ దేశాల నౌకలకు రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత వాణిజ్య రవాణా కార్యకలాపాలకు ఊపిరిపోసినట్లైంది. అయితే ఐఆర్జీసీ నియంత్రణలో నౌకలు ప్రయాణించాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన సుమారు 2,000 మంది సైనికులను పశ్చిమాసియాకు పంపింది. ఇదే సమయంలో ఇరాన్ నౌకాదళాధిపతి అలీ రెజా తంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండగా, ప్రపంచ శాంతి, వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!