
అఫ్గానిస్థాన్లోని కాబుల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద, అమానుష చర్యగా అభివర్ణించిన భారత విదేశాంగ శాఖ (MEA), పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని పేర్కొంది. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా చూపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఇది అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారంపై నేరుగా దాడి అని స్పష్టం చేసింది.
ఇలాంటి చర్యలు ప్రాంతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తాయని భారత్ హెచ్చరించింది. తమ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ సరిహద్దులకు ఆవల హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. ఈ దాడికి బాధ్యులపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపి, బాధితులకు సానుభూతి వ్యక్తం చేసింది. ఈ దాడిలో 400 మందికి పైగా మరణించగా, ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందని అఫ్గాన్ అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!