

అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి భారీగా సైనిక సామగ్రి చేరడం అనుమానాలకు దారితీస్తోంది. గత 24 గంటల్లోనే సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ వాహనాలు అష్దోద్, హైఫా పోర్టులకు చేరుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ తర్వాత ఇప్పటివరకు 1,15,600 టన్నుల సామగ్రి పంపినట్లు వెల్లడించారు.
ఇక ఇరాన్పై సైనిక చర్యకు సంబంధించి కొత్త ప్రణాళికలను అమెరికా సెంట్రల్ కమాండ్ రూపొందించి డొనాల్డ్ ట్రంప్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై శక్తివంతమైన దాడులు చేసి టెహ్రాన్ను చర్చలకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిలో కొంత భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని కూడా అమెరికా పరిశీలిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా విరమించాలనే డిమాండ్ కొనసాగుతుండటంతో, మళ్లీ పెద్ద స్థాయి ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!