

మేడారం మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన చారిత్రక ఘట్టం మేడారమేనని పేర్కొన్నారు. ధీరత్వమే దైవత్వంగా మారిన సత్యానికి నిదర్శనంగా సమ్మక్క–సారలమ్మల జాతర నిలుస్తుందన్నారు. గుడి లేకపోయినా గుండె నిండా కొలుచుకునే తల్లులను స్మరించే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇదని, కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క–సారలమ్మలని సీఎం కొనియాడారు. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర నుంచి ఫిబ్రవరి 6, 2023 న ప్రజాకంఠక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర ప్రారంభించానని, తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
మేడారం అభివృద్ధి తనకు లభించిన అరుదైన అదృష్టమని పేర్కొన్న సీఎం, వంద రోజుల్లోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించామని, జాతర నాటికి పనులన్నీ పూర్తి చేశామని చెప్పారు. గిరిజనుల కోసం సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి చేసినందుకు జీవితాంతం గర్వపడతానన్నారు. ఫిబ్రవరి 6, 2023 న మేడారంలో పెట్టుకున్న మొక్కును ఇప్పుడు తీర్చుకున్నామని, జంపన్న వాగులో నిరంతరం నీరు పారేలా రామప్ప, లక్నవరం నుంచి నీటిని తరలిస్తామని తెలిపారు. రేపు ఉదయం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని, మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!