

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పొద్దుటూరి చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. బుధవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ బాలసాని ప్రవీణ్కుమార్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ ఏసీపీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కూకట్పల్లి, మూసాపేట, అల్వాల్ సర్కిళ్లలో చెరువుల డెసిల్టింగ్ మరియు నిర్వహణ పనులకు సంబంధించిన రూ.1.40 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయడానికి గుత్తేదారు నుంచి మొత్తం రూ.30 లక్షల లంచం రెండు విడతలుగా డిమాండ్ చేసినట్టు వెల్లడైంది.
నిందితులను అనంతరం అనిశా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అలాగే పేట్ బషీరాబాద్లోని చిన్నారెడ్డి నివాసంలో అనిశా అధికారులు రాత్రివరకు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు. అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అనిశా స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!