

ఇరాన్, అమెరికా–ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా పై పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్లో కూడా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడిందని వార్తలు వస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా తగ్గడంతో కొరత సమస్య తీవ్రంగా మారింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని చోట్ల మెనులో పరిమిత ఆహార వంటకాలనే అందిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభావం తిరుమల పై కూడా పడుతుందనే ప్రచారం మొదలైంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ సరఫరా నిలిపివేయకుండా చూడాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ సంస్థకు లేఖ రాశారు. టీటీడీ పరిధిలో ప్రతిరోజూ సుమారు 5 టన్నుల గ్యాస్ వినియోగం ఉంటుందని అధికారులు వివరించారు. అన్నప్రసాదం తయారీతో పాటు ఇతర అవసరాలకు కూడా గ్యాస్ అవసరం ఉండటంతో సరఫరా నిరంతరం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
టీటీడీ అధికారుల అభ్యర్థన పై ఇండియన్ ఆయిల్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తిరుమలకు ప్రతిరోజూ 5 టన్నుల గ్యాస్ సరఫరా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. దీంతో టీటీడీ అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!