

జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను సాధించామని గుర్తుచేశారు. పదేళ్లపాటు సుభిక్షంగా పాలించిన రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆగం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ శక్తుల పునరేకీకరణతో తెలంగాణ పునర్నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాలలో జరిగిన ప్రజాశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్రెడ్డిని పార్టీకి ఆహ్వానించిన కేసీఆర్, పలువురు నేతలకు కండువా కప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూముల ధరలు పడిపోయాయని, పంటలకు సరైన ధరలు లభించడం లేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగాయని, సింగరేణి సంస్థ దెబ్బతిందని, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించలేదని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగతి, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు పెట్టే యత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దీనిపై పోరాటానికి సిద్ధమవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో కేంద్ర ఒత్తిడిని తిప్పికొట్టామని, ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మళ్లీ పోరాటం అవసరమని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!