

దిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవితతో పాటు ఇతర ప్రతివాదులకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ట్రయల్ కోర్టు 23 మంది నిందితులకు విముక్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యలపై తాత్కాలిక స్టే విధించింది.
సీబీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దిల్లీ చరిత్రలోనే మద్యం విధాన కేసు అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆప్ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉన్నాయని, అందులో కొంత మొత్తాన్ని హవాలా ద్వారా గోవా ఎన్నికల కోసం ఉపయోగించారని తెలిపారు. అయితే ట్రయల్ కోర్టు సరైన విచారణ లేకుండానే నిందితులను విడుదల చేసిందని సీబీఐ వాదించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!